ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం?
సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన ఘటన... లారీలో ఒక్కసారిగా భారీ మంటలు.. డ్రైవర్, క్లీనర్ మృతి చెందినట్లు సమాచారం... అటవీ ప్రాంతానికి వ్యాపించిన మంటలు.. అదుపుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రయత్నం...

గువ్వల చెరువు ఘాట్ రోడ్డు, సెప్టెంబరు 8: గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లినట్లు సమాచారం.
లోయలో పడిన వెంటనే లారీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ బయటకు రాలేక సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో లారీ నుంచి చెలరేగిన మంటలు చుట్టుపక్కల పొదలు, చెట్లకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రమాదానికి కారణం వాహనం అదుపుతప్పడమా, బ్రేకులు విఫలమయ్యాయా, లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల గుర్తింపు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

