చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు.. ప్రత్యామ్నాయం చూపించాలి
• కేసరపల్లి చిరువ్యాపారులకు జీవనాధారం కల్పించాలని డిమాండ్... • ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా ఖాళీ చేయించడం సరికాదన్న ఎలిజబెత్ రాణి... • సమస్యపై కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం...

గన్నవరం, ఆగస్టు 29: కేసరపల్లి గ్రామంలో చిరువ్యాపారులను ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా ఖాళీ చేయించడంతో వారి జీవనాధారం దెబ్బతిందని గన్నవరం మండలం జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత చిరువ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
కేసరపల్లి గ్రామంలోని చెరువు చుట్టూ ఉన్న ప్రభుత్వ స్థలంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన పలు కుటుంబాలు కొబ్బరి బొండాలు, టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, టీ బడ్డీలు తదితర చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు వారిని ఖాళీ చేయించడంతో గత రెండు రోజులుగా వ్యాపారాలు చేసుకోలేక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
పేద చిరువ్యాపారులను ఖాళీ చేయించాల్సి వస్తే ముందుగానే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి, వారికి తగిన ప్రత్యామ్నాయం కల్పించి న్యాయం చేయాలని ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు.

