గొడ్డలితో ఆగంతకుడు.. భయాందోళనలో చిట్టినగర్ ప్రజలు
అర్ధరాత్రి గొడ్డలి చేతబట్టి వీధుల్లో సంచారం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు... ఇళ్ల తలుపులు, గేట్ల వద్ద తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి... రాత్రి గస్తీ పెంచి ఆగంతకుడిని గుర్తించాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి...

విజయవాడ, చిట్టినగర్: అర్ధరాత్రి వేళ చేతిలో గొడ్డలి పట్టుకుని ఓ గుర్తుతెలియని వ్యక్తి వీధుల్లో సంచరిస్తుండటంతో చిట్టినగర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఇళ్ల సమీపంలో తిరుగుతున్న ఆ వ్యక్తి కదలికలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం.
చిట్టినగర్, మురళీ ఫార్క్ ఎదుట ఉన్న సాయి అరుణ పబ్లిక్ స్కూల్ అడ్డరోడ్డులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సుమారు 12.10 గంటల సమయంలో గొడ్డలి చేతబట్టి ఆ వ్యక్తి వీధుల్లో తిరిగినట్లు పేర్కొన్నారు. ఇళ్ల ముందు ఉన్న పూల మొక్కలు, చిన్నచిన్న చెట్లను నరికినట్లు స్థానికులు తెలిపారు.
రాత్రివేళల్లో ఆ వ్యక్తి తరచూ ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్ల గేట్లు, పరిసరాల వద్ద సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.
సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

