కన్నుల పండువగా అష్టదళ గణపతి ప్రాణప్రతిష్ఠ
వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు సామూహిక హోమంలో పాల్గొన్న భక్త దంపతులు భక్తిశ్రద్ధలతో మార్మోగిన విఘ్నేష్ హైట్స్ ప్రాంగణం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 31: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన చిన్ననగర్లో శ్రీశ్రీశ్రీ అష్టదళ గణపతి స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కన్నుల పండువగా జరిగింది. సీవీఆర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న విఘ్నేష్ హైట్స్ ప్రాంగణంలో ఇటీవల నిర్మించిన అష్టదళ గణపతి స్వామివారి పూజా మందిరంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా కలశ స్థాపన చేపట్టి గణపతి స్వామి, మూషికం, అభయాంజనేయ స్వామి, నందీశ్వరుడి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. తొలుత వేద మంత్రోచ్చారణల మధ్య సామూహిక హోమాన్ని నిర్వహించారు. ఈ హోమ పూజలో

జమ్ము శ్రీనివాసరావు–శ్రీలక్ష్మి, గూడేల ఆనందు–అలేఖ్య, మూడ దుర్గాప్రసాద్–భాగ్యలక్ష్మి, పైడిపాటి దుర్గారావు–జయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. మందిర నిర్మాణ కమిటీ సభ్యుడు మాధవిపురి సత్యనారాయణ, విఘ్నేష్ హైట్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.వి. లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు, వేలూరి విమల, సిద్ధాంతి ప్రకాశ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఫొటోలు: అష్టదళ గణపతి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హోమం నిర్వహిస్తున్న దృశ్యం; ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు.

