తిరంగామయమైన గుడివాడ పురవీధులు
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ... జాతీయ జెండాలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.. కూటమి శ్రేణుల సందడి... యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 14 (V10TV): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబట్టి ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో పురవీధులను హోరెత్తించారు.
గుడివాడ ప్రజావేదిక కార్యాలయం వద్ద ప్రారంభమైన తిరంగా బైక్ ర్యాలీ నాగవరప్పాడు సెంటర్, ఏలూరు రోడ్డు, మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, ఏజీకే స్కూల్ సెంటర్, నెహ్రూ చౌక్ మీదుగా సాగి తిరిగి ప్రజావేదిక కార్యాలయానికి చేరుకుంది. ఏజీకే స్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ గుడివాడ’, జాతీయ జెండా సెల్ఫీ పాయింట్ల వద్ద నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. జాతీయ జెండా ప్రతి భారతీయుడి గౌరవానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ తిరంగా ర్యాలీ గుడివాడలో దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించిందన్నారు. జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీలో పాల్గొనడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ర్యాలీలో గుడివాడ జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ జిల్లా నాయకుడు సురే లక్ష్మీనారాయణ గాంధీ, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన గుడివాడ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు చేకూరు జగన్ మోహన్ రావు, జనసేన నాయకుడు సాయన రాజేష్తో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

