మిలాద్ శాంతి ర్యాలీలో సందడి చేసిన ఎమ్మెల్యే రాము
ప్రవక్త బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముబారక్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు.. ప్రత్యేక ఆకర్షణగా యువత బైక్ ర్యాలీ


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 26: మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో బుధవారం మిలాద్-ఉన్-నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మిలాద్-ఉన్-నబీ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం ముబారక్ సెంటర్ నుంచి భారీ శాంతి ర్యాలీ ప్రారంభమైంది. వేలాది మంది ముస్లిం సోదరులు, యువత, చిన్నారులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలు సంప్రదాయ పద్ధతిలో ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి నేతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శాంతి ర్యాలీలో పాల్గొనడం ఎంతో

సంతోషంగా ఉందన్నారు. ప్రవక్త ప్రపంచానికి అందించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవతా సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో, సోదరభావంతో జీవించాలని కోరారు. ముబారక్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, ఏలూరు రోడ్డు, నెహ్రూ చౌక్ సెంటర్, ఎజికే స్కూల్ సెంటర్ మీదుగా సాగి తిరిగి ముబారక్ సెంటర్కు చేరుకుంది. ర్యాలీ మార్గంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత నిర్వహించిన బైక్ ర్యాలీ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహనరావు, మైనార్టీ పెద్దలు షేక్ మౌలాలి, షేక్ జానీ షరీఫ్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కార్, షేక్ ఇబ్రహీం, కరీముల్లా, సయ్యద్ జబీన్, అబ్బాస్తో పాటు పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు.
