ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తుల మృతి
బిహార్లోని అశోక్ ధామ్ ఆలయంలో విషాదం... ఎలక్ట్రిక్ వైర్ తెగిపడటంతో భయాందోళన.. బయటకు పరుగులు తీసిన భక్తులు... పదుల సంఖ్యలో గాయాలు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు...

లఖిసరాయ్, ఆగస్టు 17 (V10TV): బిహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
శ్రావణ మాసం సోమవారం కావడంతో శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో భక్తుల మధ్యలో ఓ ఎలక్ట్రిక్ వైర్ తెగిపడటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. విద్యుత్ షాక్ తగులుతుందనే భయంతో భక్తులు బయటకు పరుగులు తీయడంతో బారికేడ్లు పడిపోయి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
ఘటనలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, క్షతగాత్రులకు సత్వర వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేసినప్పటికీ భయాందోళనతో ఒక్కసారిగా పరుగులు తీయడంతో బారికేడ్లు పడిపోయాయని లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వైర్ కారణంగానే ఘటన జరిగిందా అనే అంశాన్ని ధ్రువీకరించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

