ప్రిన్సిపాల్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. పదో తరగతి విద్యార్థే నిందితుడు!
నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు... సుమారు 80 మందిని విచారించిన ప్రత్యేక బృందాలు.. విద్యార్థులపై అనుమానం... హత్య అనంతరం రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానం.. హత్యకు కారణంపై ఆరా...

నల్గొండ: పట్టణంలోని జేబీ కాలనీలో వారం రోజుల క్రితం జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పదో తరగతి చదువుతున్న వంశీని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడికి మరో వ్యక్తి సహకరించినట్లు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
రూపారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. నిందితుడు గ్లౌజులు ధరించి నేరానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో స్పష్టమైన ఆనవాళ్లు లభించకపోవడం పోలీసులకు సవాలుగా మారింది.
లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బంది, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం రంగంలోకి దిగి కేసుపై దృష్టి సారించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులపై అనుమానం బలపడినట్లు సమాచారం.
ముగ్గురిపై అనుమానం రావడంతో మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూపారెడ్డి హత్య అనంతరం సుమారు రూ.4 లక్షల నగదు చోరీకి గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు అసలు కారణమేంటి? నగదు కోసమే హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

