పక్షవాత బాధితుడికి రూ.6 లక్షల వైద్య భరోసా
సీఎం సహాయ నిధి నుంచి ఎల్ఓసీ మంజూరు ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో తక్షణ సాయం బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన కూటమి నేతలు

విజయవాడ, ఆగస్టు 28: పక్షవాతంతో బాధపడుతూ మెరుగైన వైద్యం అవసరమైన ఓ బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో రూ.6 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది. శివాలయం సెంటర్కు చెందిన ఎస్. మల్లికార్జునరావు (63) పక్షవాతంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి పరిస్థితిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.6 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరుకు చొరవ చూపారు. మంజూరైన ఎల్ఓసీని భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష తదితర కూటమి నేతలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కందుల సుబ్రహ్మణ్యం యాదవ్, పచ్చవ మల్లికార్జునరావు, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, జయ బాలన్ తదితరులు పాల్గొన్నారు.

