గంగిరెద్దుల కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: విప్ యార్లగడ్డ
ప్రత్యేక కార్పొరేషన్ సహా న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి గంగిరెద్దుల యువత కృత్రిమ మేధ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి తెంపల్లెలో సంచార జాతుల విముక్తి దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, సెప్టెంబర్ 1: గంగిరెద్దుల కులస్తుల సమస్యలను శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలం తెంపల్లె గ్రామంలో గంగిరెద్దుల కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంచార జాతుల విముక్తి దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, గంగిరెద్దుల ప్రదర్శనలతో ఎమ్మెల్యేకు కుల సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమ్యూనిటీ హాల్ వద్ద సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గంగిరెద్దుల కళ గ్రామీణ సంస్కృతికి, తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. చిన్నతనంలో తెంపల్లెకు వచ్చిన గంగిరెద్దుల ఆటలను చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. గంగిరెద్దుల కులాన్ని గుర్తించి, వారి అభివృద్ధికి చర్యలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు. 2016లో జీవో నంబర్ 17 ద్వారా సంచార జాతులతోపాటు 32 కులాలను అత్యంత వెనుకబడిన తరగతుల పరిధిలోకి తీసుకొచ్చి గుర్తింపు కల్పించారని తెలిపారు. గంగిరెద్దుల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు, కుటుంబాలకు భద్రత, కళాకారులకు గౌరవం కల్పించడం


ప్రత్యేక హక్కులు కాదని, వారి జీవనానికి అవసరమైన న్యాయమైన హక్కులని స్పష్టం చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, విద్యాసంస్థల్లో ప్రత్యేక సీట్లు, సబ్సిడీ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, కళాకారులకు పింఛన్లు వంటి డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కేసరపల్లిలో హెచ్సీఎల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కృత్రిమ మేధ శిక్షణ కేంద్రాన్ని గంగిరెద్దుల యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది కుల సభ్యులతోపాటు సంఘం జాతీయ అధ్యక్షుడు గణగణాల సీతన్న, రాష్ట్ర అధ్యక్షుడు ధనకొండ హేబేల్రాజు, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు తమటం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెంపల్లెలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.

