గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా
సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో భారీ అవగాహన ర్యాలీ మత్తుకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని యువతకు పిలుపు గంజాయి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ

ఇబ్రహీంపట్నం: మత్తుపదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శనివారం పట్టణవ్యాప్తంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కు చేరుకుంది. అక్కడ పోలీసులు ప్రజలు, విద్యార్థులు, యువతను ఉద్దేశించి మత్తుపదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్షణికానందం కోసం గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తుపదార్థాల వినియోగంతో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలతోపాటు చట్టపరమైన పరిణామాలను క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు. విద్యార్థులు చదువు, యువత ఉద్యోగం, కెరీర్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఇబ్రహీంపట్నం నిర్మాణానికి ప్రజలంతా పోలీసులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై సత్యవతి, పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
