పాల ధర పెంపుపై భగ్గుమన్న సీపీఎం
నాలుగు నెలల్లో మరోసారి లీటర్కు రూ.2 పెంపుపై ఆందోళన.. హెరిటేజ్, ప్రైవేటు డెయిరీల కోసమే విజయ డెయిరీని దెబ్బతీస్తున్నారని ఆరోపణ... ధరల పెంపు వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక... విజయవాడ:

విజయవాడ:కృష్ణా మిల్క్ యూనియన్కు చెందిన విజయ పాల ధరలను ఆగస్టు 10 నుంచి లీటర్కు రూ.2 పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సీపీఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం లెనిన్ సెంటర్లోని విజయ డెయిరీ వద్ద ధర్నా నిర్వహించారు. నాలుగు నెలల వ్యవధిలోనే మరోసారి పాల ధరలు పెంచడం సామాన్యులపై అదనపు భారం మోపడమేనని సీపీఎం నేతలు మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో కార్యకర్తలు పాల ధరల పెంపునకు వ్యతిరేకంగా, విజయ డెయిరీని పరిరక్షించాలని నినాదాలు చేశారు. బాలబాలికలు విజయ పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలపగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. కాశీనాథ్ మాట్లాడుతూ ఏప్రిల్లోనే విజయ పాల ధరను లీటర్కు రూ.2 పెంచారని, నాలుగు నెలలు కూడా గడవకముందే మరో రూ.2 పెంచడం అన్యాయమని విమర్శించారు. బియ్యం, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో పాల ధరల పెంపు సామాన్య కుటుంబాలపై మరింత భారం మోపుతుందని పేర్కొన్నారు.
పాల ధరల పెంపుతో విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలపై ఏడాదికి సుమారు రూ.36 కోట్ల అదనపు భారం పడుతుందని, వరుస పెంపులతో ఈ భారం భారీగా పెరిగిందని నేతలు పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ అవసరమయ్యే పాలను కూడా సామాన్యులకు భారంగా మార్చడం సరికాదన్నారు.
హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీలకు ప్రయోజనం కలిగించే విధంగా సహకార రంగంలోని విజయ డెయిరీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాబురావు ఆరోపించారు. సుమారు 1.50 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. సహకార సంఘం నాయకత్వంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపైనా ఆయన పలు ఆరోపణలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అమూల్ పేరుతో రైతులు, వినియోగదారుల ప్రయోజనాలకు నష్టం కలిగించే ప్రయత్నం జరిగిందని, ప్రస్తుతం హెరిటేజ్, ప్రైవేటు డెయిరీల ప్రయోజనాల కోసం విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విజయ డెయిరీ పాల ధర పెరిగితే ఇతర ప్రైవేటు డెయిరీలు కూడా ధరలు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పాల ధరలను తక్షణమే రద్దు చేయడంతో పాటు కృష్ణా మిల్క్ యూనియన్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని, పాల ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
ధర్నాలో సీపీఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణరావు, పి. కృష్ణ, ఇవి. నారాయణ, టీ. ప్రవీణ్, కాజా సరోజ, గాదే ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

