చిన్న వర్షానికే పశ్చిమం జలమయం
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్లో వెలంపల్లి పర్యటన ముంపు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శ


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ): విజయవాడ నగరంలో కురిసిన వర్షానికి పశ్చిమ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 42వ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీ రోడ్డు, కుండల బజార్ తదితర ప్రాంతాలను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కాలువలు, డ్రైన్లలో ముందస్తుగా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని

విమర్శించారు. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అనారోగ్యం బారినపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. కాలనీల్లో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఫోన్లో కోరారు. డ్రైన్లు, కాలువల్లో పూడికతీత చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని వెలంపల్లి హెచ్చరించారు.
