టిడ్కోను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం
30 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీ ఏర్పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో ప్రమాణ స్వీకారం కాలనీ సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 12 : గుడివాడ–మచిలీపట్నం రోడ్డులోని టిడ్కో కాలనీ అభివృద్ధికి 30 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటైంది. శనివారం కాలనీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సేవాభావం, అంకితభావంతో కాలనీ అభివృద్ధికి కృషిచేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ టిడ్కో కాలనీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీ సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టిందన్నారు. అభివృద్ధి


ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, ప్రాధాన్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ టిడ్కోను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాలనీలో అవసరమైన సౌకర్యాల కల్పనకు నూతన కమిటీ చేసే ప్రతి ప్రయత్నానికీ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నివాసితుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావుతోపాటు కూటమి నాయకులు, కమిటీ సభ్యులు, కాలనీ నివాసితులు పాల్గొన్నారు. ఫోటో రైట్అప్: టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

