సైబర్ మోసాలకు చెక్.. ఎల్ఈడీ స్క్రీన్లతో ఖాకీ అలర్ట్!
విజయవాడలో వినూత్నంగా సైబర్ నేరాలపై అవగాహన... పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచారం... గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయొద్దని ప్రజలకు పోలీసుల సూచన...

విజయవాడ, ఆగస్టు 26: పెరుగుతున్న సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా అప్రమత్తం చేసేందుకు పటమట పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, వాటి నుంచి ప్రజలు ఎలా రక్షణ పొందాలనే అంశాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఈ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్కు స్పందించి బ్యాంకు ఖాతా, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బహుమతులు తదితర పేర్లతో వచ్చే సందేశాలను నమ్మేముందు వాటి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని చెబుతున్నారు.
సైబర్ మోసాలపై అవగాహన పెంచడం ద్వారానే నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను కాపాడగలమని పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన వారు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
సాంకేతికతను ఉపయోగించుకొని నేరాలు చేస్తున్న సైబర్ కేటుగాళ్లకు అదే సాంకేతికతతో ప్రజల్లో అవగాహన పెంచుతూ చెక్ పెట్టేందుకు పటమట పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంటోంది.

