గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం: హోంమంత్రి అనిత
గతేడాది మాదిరిగానే ఈసారి ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఉచిత విద్యుత్ కల్పించాలని వినతి నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ

విజయవాడ: గణేష్ ఉత్సవాలను గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. బుధవారం గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలోని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హోంమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతులు పొందడంలో ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయాలని సమితి సభ్యులు కోరారు. అలాగే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పేర్కొన్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా గణేష్ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సమితి సభ్యులకు హామీ ఇచ్చారు.

