అమరావతి నిర్మాణానికి రూ.41,187.70 కోట్ల రుణ సమీకరణ
119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో 97 పనులు ప్రారంభం... ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి నారాయణ... 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు...

అమరావతి, ఆగస్టు 17 (V10TV AP): రాజధాని అమరావతి నిర్మాణ పనులకు రూ.41,187.70 కోట్ల మేర రుణ సమీకరణ చేపట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అడిగిన పలు ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు.
రాజధాని అమరావతిలో మొత్తం 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ఉండగా, వాటిలో 97 పనులు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.41,187.70 కోట్ల రుణాన్ని సమీకరించగా, ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి సభకు వెల్లడించారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించినట్లు తెలిపారు. అమరావతిలో మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

