50 వేల రైలు కోచ్లు.. కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
2014 తర్వాత దేశంలో 50 వేల ఆధునిక రైల్వే కోచ్ల తయారీ: ప్రధాని... పదేళ్లలో 50 వేల మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయారని గత కాంగ్రెస్ పాలనపై విమర్శ... వడోదరలో రూ.35 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వ్యాఖ్యలు...

వడోదర, సెప్టెంబరు 8: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. 2014 తర్వాత దేశంలో 50 వేల ఆధునిక రైల్వే కోచ్లను తయారు చేశామని, అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం పదేళ్లలో 50 వేల మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
గుజరాత్లోని వడోదరలో మంగళవారం రూ.35 వేల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని మూడు కీలక సెక్షన్లను కూడా జాతికి అంకితం చేశారు.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ దేశ వాణిజ్య, రవాణా రంగానికి కీలకంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమ ఫ్రైట్ కారిడార్లు దేశ వ్యాపార వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలుస్తాయని చెప్పారు. 2014 తర్వాత ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని, దేశ యువత నిజం వైపే నిలుస్తుందని పేర్కొన్నారు.

