“కాలేజీ విద్యార్థులకు పోలీసుల భద్రతా పాఠాలు”
మహిళల భద్రత, మాదక ద్రవ్యాలు, రోడ్ సేఫ్టీపై పోలీసుల అవగాహన... సైబర్ నేరాలు, ర్యాగింగ్పై విద్యార్థులకు కీలక సూచనలు... నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో సీఐ తాళ్లూరి అశోక్ బాబు సందేశం...

నరసరావుపేట: విద్యాసంస్థల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడటంతో పాటు విద్యార్థులను మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్ వంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యంగా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాళ్లూరి అశోక్ బాబు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
రోడ్ సేఫ్టీపై మాట్లాడుతూ హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాల విషయంలో డిజిటల్ అరెస్ట్, ఉద్యోగ మోసాలు, కేవైసీ మోసాలు, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగాన్ని కూడా వివరించారు.
ర్యాగింగ్ చట్టవిరుద్ధమని, కొత్త విద్యార్థులను మానసికంగా లేదా శారీరకంగా వేధించడం, బెదిరించడం, అవమానించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

