అన్నార్థుల ఆకలి తీర్చిన అప్పన చారిటబుల్ ట్రస్ట్
అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సేవా కార్యక్రమం.. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ.. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన లయన్ గోలి మల్లేశ్వరి..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 16 (V10TV AP): అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా విజయవాడలో నిర్వహించిన ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం సేవా స్ఫూర్తిని చాటింది. రథం సెంటర్ సమీపంలోని అప్పన వెంకట కృష్ణయ్య ధర్మ సత్రంలో అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లయన్స్ జిల్లా 316D స్త్రీలు మరియు కుటుంబ సంక్షేమ విభాగం ప్రతినిధి లయన్ గోలి మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం గొప్ప సేవ అని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని మరింత పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో చైర్మన్ లయన్ అప్పన వెంకట సత్యసాయిబాబు, శ్రీమతి మధురవాణి, క్లబ్ కార్యదర్శి నాగభూషణం సుంకర, లయన్స్ ప్రతినిధి మడమల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. భక్తులు, అన్నార్థులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.
స్థానికులతో పాటు శ్రీ కనకదుర్గమ్మ దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన అనేకమంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

