అసెంబ్లీలో గళమెత్తిన బోండా ఉమ.. రెండో ఫ్లైఓవర్కు వినతి
సింగ్నగర్లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి... రోజూ 1.50 లక్షల మంది రాకపోకలు.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరిన ఎమ్మెల్యే... రూ.70 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిత ఫ్లైఓవర్పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినతి...

విజయవాడ, ఆగస్టు 18 (V10TV AP): విజయవాడ సింగ్నగర్ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన సింగ్నగర్ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లారు.
సుమారు 1.50 లక్షల మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ ప్రాంతం ట్రాఫిక్ బాటిల్నెక్గా మారుతోందని పేర్కొన్నారు. వాహనాల రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో సింగ్నగర్లో రెండో ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బోండా ఉమ సభకు తెలిపారు. ఇప్పటికే రైల్వే శాఖ అంచనా ప్రకారం సుమారు రూ.70 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఫ్లైఓవర్ను నిర్మించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కీలకమైన ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని బోండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

