మైనర్ బాలికలపై లైంగిక దాడి కలకలం
ఇద్దరు ఆటో డ్రైవర్లపై తీవ్ర ఆరోపణలు... నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు... ఎస్పీ ఆదేశాలతో పెడన, బందరు రూరల్ పోలీసుల ముమ్మర దర్యాప్తు...

క్రైమ్ న్యూస్ – కృష్ణా: మచిలీపట్నం పరిధిలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. పెడన మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఈ నెల 6న పాఠశాల నుంచి మచిలీపట్నం వచ్చినట్లు సమాచారం. బాలికలు తమకు పరిచయమున్న వ్యక్తికి ఫోన్ చేయడంతో అతడు మరో వ్యక్తితో కలిసి ఆటోలో కోనేరు సెంటర్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాలికలను ఆటోలో ఎక్కించుకుని రుద్రవరం ప్రాంతంలోని నిర్మానుషంగా ఉన్న టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు బాలికల్లో ఒకరు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వెల్లడించినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు పెడన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పెడన, బందరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం. బాధిత బాలికల గోప్యతకు భంగం కలగకుండా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

